
- సాయిల్ టెస్టులు, ట్రాఫిక్ సర్వేలు పూర్తి
- ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర ప్రభుత్వానికి మేడ్చల్, శామీర్ పేట, ఫోర్త్ సిటీ డీపీఆర్లు
- సీఎం విధించిన గడువులోపు పూర్తి చేసేందకు మెట్రో కసరత్తు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సెకండ్ఫేజ్పార్ట్–ఏలోని నార్త్ సిటీ మెట్రో డీపీఆర్ల ప్రిపరేషన్ పూర్తి కావొచ్చింది. ఈ రెండు కారిడార్లకు సంబంధించి సాయిల్టెస్టులు, సర్వేలు పూర్తయ్యాయి. ఈ నెల చివరి నాటికి ఇతర అంశాలను కూడా డీపీఆర్ లో చేర్చి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మేడ్చల్, శామీర్ పేట్ తో పాటు ఎయిర్పోర్ట్నుంచి ఫ్యూచర్ సిటీకి నిర్మించబోయే మెట్రో డీపీఆర్ కూడా మార్చిలోపు ఇవ్వాలని సీఎం ఆదేశించినా.. ఫ్యూచర్సిటీ డీపీఆర్ లేట్ అయ్యేలా కనిపిస్తోంది.
మేడ్చల్ రూట్లో డబుల్ డెక్కర్ నిర్మించాలా, లేక ప్రత్యేక రూట్లో ఎలివేటెడ్ మార్గం నిర్మించాలా అనేది ఫైనల్ కానట్లు తెలుస్తున్నది. అయితే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి నార్త్ సిటీ పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలను చేర్చి, ఫోర్త్ సిటీ డీపీఆర్ ను కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆర్థిక, సాంకేతిక, సామాజిక అంశాల సేకరణ పూర్తి
మెట్రో డీపీఆర్ రూపకల్పనలో ఎకనామికల్, సోషల్, టెక్నికల్అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కమర్షియల్ ఏరియాలు, జనసాంద్రత ఆధారంగా రైల్వే స్టేషన్ల ఎంపిక చేశారు. జేబీఎస్–-మేడ్చల్ మార్గంలో 25 ప్రాంతాల్లో, జేబీఎస్–-శామీర్పేట మార్గంలో 19 ప్రాంతాల్లో భూపరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ సర్వేలో భాగంగా రోజూవారీ ప్రయాణికుల సంఖ్య, శామీర్పేట, మేడ్చల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీహబ్ లు, రెసిడెన్షియల్ ఏరియాల ఆధారంగా ట్రాన్స్పోర్ట్ను అంచనా వేసి డీపీఆర్రెడీ చేస్తున్నారు.
ఐదు కారిడార్ల ఆమోదం కోసం కసరత్తు
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సెకండ్ఫేజ్పార్ట్ఏలోని ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ల ఆమోదం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి మెట్రో పొడిగింపునకు సహకరించాలని కోరారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు డీపీఆర్మాత్రం ఆమోదం పొందలేదు. మెట్రో అధికారులు కూడా సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
త్వరలోనే ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్లు ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తున్నది. కేంద్రంలో డీపీఆర్లు ఆమోదం పొందితే, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు సేకరించడానికి అనుమతి లభిస్తుంది. డీపీఆర్లు ఆమోదం పొందితే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ఊపందుకోనున్నాయి.